నీళ్లు ఫామ్ హౌజ్‌‌కు.. నియామకాలు ఫ్యామిలీకి

నీళ్లు ఫామ్ హౌజ్‌‌కు.. నియామకాలు ఫ్యామిలీకి

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి ఏడేళ్లవుతున్నా ఉద్యోగాలు, ఉపాధి లేకపోవడంతో రాష్ట్రంలో యువత అల్లాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని.. కానీ తెలంగాణ వచ్చాక.. నీళ్లు ఫామ్ హౌజ్‌‌కు, నిధులు సీఎం అనుయాయులకు, నియామకాలు ఆయన ఫ్యామిలీకి పోయాయని విమర్శించారు. తొలి దశ, మలి దశ ఉద్యమానికి యువతే ఊపిరి అన్నారు. లక్షలాది మంది యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసి చాలా మంది వయసు కూడా దాటిపోయిందన్నారు. 

‘రాష్ట్రంలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది TSPSCలో రిజిస్టర్ చేసుకున్నారని పదవీ విమరణ పొందిన చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. 2.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిస్వాల్ కమిటీ ప్రకటించింది. మన రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? తెలంగాణ ఏర్పడ్డాక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేశారు. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవగానే 50 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వస్తోందని ఝూటా మాటలు చెప్పి యువతను మోసం చేశారు’ అని బండి సంజయ్ దుయ్యబట్టారు.

‘25 వేల విద్యుత్ ఆర్జిజన్‌‌ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పీఆర్సీ ఇస్తామని ప్రకటించినా ఇప్పటిదాకా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా 12 వేల మంది విద్యావాలంటీర్లు పస్తులుంటున్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయనుకుంటే దాదాపు 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని రోడ్డున పడేశారు. ఇప్పటికైనా 7వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. అలాగే 2018 నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలి’ అని సంజయ్ డిమాండ్ చేశారు.